ఆ నియోకజవర్గంలో ఏ పార్టీ గెలిస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదు. గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు. అవును. మీరు విన్నది నిజమే. ఆ సెగ్మెంట్లో దశాబ్దాలుగా ఇదే సెంటిమెంట్ ప్రూవ్ అవుతోంది. గెలిచిన పార్టీ స్టేట్లో పవర్లోకి రాదు, ఓడిన పార్టీ మాత్రం సింహాసనం ఎక్కుతుంది. అందుకే ఆ నియోజకవర్గంలో గెలవడం ఎందుకని, ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తాయి. మరి ఈసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదంటే సంప్రదాయం బద్దలవుతుందా ఇంతకీ ఏదా నియోజకవర్గం?
అనంతపురం జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒక్కటైన ఉరవకొండలో, దశాబ్ధాలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే గెలుస్తూ వస్తున్నాడు. యాదృచ్ఛికమో ఓటరు చైతన్యమో తెలియదుకానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడి ఓటర్లు తిరస్కరిస్తున్నారు. దశాబ్దులుగా ఇదే ఫలితం రిపీట్ అవుతోంది. ఈ సెంటిమెంట్ను బట్టి చూస్తుంటే, ఇక్కడ ఓడటమే మేలని ప్రధాన రాజకీయ పార్టీలు లోలోన భావిస్తున్నాయి. టీడీపీ తరఫున శాసన మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, వైసీపీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పోటీపడ్డారు.
2014లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్పై 2275 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు విశ్వేశ్వర్ రెడ్డి. మరోసారి ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం చేశారు.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,744 మంది. ఇందులో లక్షా ఏడు వేల 637 మంది పురుషులు, లక్షా 8 వేల 85 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 1,85,981 ఓటర్లు అనగా, 86.22 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో ఉరవకొండ పట్టణం, మండలంతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు, బెలుగుప్ప, కూడేరు మండలాలు ఉన్నాయి. ఉరవకొండ పట్టణంతో పాటు ఉరవకొండ మండలం, బెలుగుప్పలో టీడీపీకి అధికంగా ఓట్లు పోలయ్యాయని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి వజ్రకరూరు కాంగ్రెస్, వైసీపీకే మెజార్టీ ఉంటుంది. కూడేరు, విడపనకల్లులో పోలింగ్ హోరాహోరీగా సాగినట్లు తెలుస్తోంది.
పయ్యావుల కేశవ్ ఏడాది ముందు నుంచి నియోజకవర్గంలో కలియ తిరుగుతూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రజలకు వివరించారు. హంద్రీ నీవా నీటిని చెరువులకు తీసుకురావడంతో పాటు వేల కోట్ల నిధులతో ఉరవకొండ అభివృద్ధికి పాటుపడ్డామని, అభివృద్దికి ఓటర్లు పట్టం కట్టారని తెలుగు తమ్ముళ్లు దీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభించాయని, తమ పోరాటాలతోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఐదేళ్లు ప్రజా సమస్యలపై పోరాటం చేశామని ప్రభుత్వంతో పనులు చేయించేందుకు తమ వంతు కృషి చేశామని అంటున్నారు. ఇలా గెలుపుపై ఎవరి దీమా వారిదే. అంతిమ ఫలితం మే 23నే తేలుతుంది.