బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా దీక్ష చేస్తున్న డా. లక్ష్మణ్ను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొద్దిసేపు పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు, ఇంటర్ బోర్డ్ వైఫల్యాలపై నిరసనలతో హోరెత్తించిన తెలంగాణ బీజేపీ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహారదీక్ష చేపట్టేందుకు దిగారు. ఈ మొత్తం పరిణామాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి జగదీశ్రెడ్డిని భర్తరఫ్ చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
అంతకముందు సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డ్లో అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ABVP విద్యార్ధి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. వీరితో పాటు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన జనసేన, వామపక్షల నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్ధి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడక్కడ ముందస్తుగానే ప్రధాన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.