కేంద్రంపై కన్నేరజేసిన కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.మోడీ అండ్ బీజేపీ టార్గెట్గా చెలరేగిపోయారు. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్షతో పాటు సవతి తల్లి ప్రేమ చూపుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేకపోవడంతో రాష్ట్రంపై కేంద్రం పక్షపాతం చూపిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేంద్రం సాయం చేస్తూ తెలంగాణను మాత్రమే నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న కేంద్రం. తెలంగాణ సాగు-తాగునీటి ప్రాజెక్టులకు మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. 19వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం తిరస్కరించిందని మండిపడ్డారు. మోడీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రధానమంత్రా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఇకనైనా తెలంగాణపై పక్షపాతాన్ని వీడాలన్నారు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పకుండా పార్లమెంట్లో ఎండగడుతూ నిలదీస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.