రెండో శాసనసభ సమావేశాల ప్రారంభంలోనే టీఆర్ఎస్ రెండో విడత ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పట్టింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లోకి మళ్లీ వలసలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అర్థరాత్రి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. ఈ మధ్యాహ్నం సీఎంను కలవనున్నట్టు సమాచారం. సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్థంతికి ఏర్పాట్లు చేయగా సండ్ర హైదరాబాద్ రావడంతో ఆయన అనుచరులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
మరోవైపు గజ్వేల్లో కేసీఆర్పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ వంటేరుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. టీఆర్ఎస్లో చేరాక వంటేరుకు ఎమ్మెల్సీ లేదా గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.