ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర: తలసాని
రాబోయే నాలుగు నెలల్లో దేశ రాజకీయాల ముఖచిత్రం మారబోతోందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రాబోయే నాలుగు నెలల్లో దేశ రాజకీయాల ముఖచిత్రం మారబోతోందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన తీరు సరిగ్గా లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వెంట పడుతున్నారని అన్నారు. చంద్రబాబు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలెప్పుడూ సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటారని, ఆంధ్రా రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలియజేశారు.