టీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్...ఆందోళన చెందుతోన్న మంత్రులు, నియోజకవర్గాల ఇంచార్జీలు
టీఆర్ఎస్ మంత్రులకు, నియోజకవర్గ ఇంచార్జీలకు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టెన్షన్ పట్టుకుంది. తాము పనిచేసిన నియోజక వర్గాల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే సందిగ్ధత ఒకటైతే ఆశించిన మెజార్టీ రాని నియోజకవర్గ నేతల్లో తమ భవిష్యత్ ఏంటనే ఆందోళన కనిపిస్తోంది.
టీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్సన్ పట్టుకుంది. 2014 ఎన్నికల్లో కంటే రెండు సీట్లు తక్కువే రావడం టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడకుండా మారింది. సీఎం కేసీఆర్ తీసుకునే కఠిన నిర్ణయాలకు బలికావాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సారి వారసులకు టికెట్ ఇప్పించుకున్న మంత్రులు తలసాని, మల్లారెడ్డిల భవితవ్వంపై కూడా ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు. మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఓడిపోతే ఆయన్ను మంత్రి వర్గం నుంచి కూడా తప్పిస్తారనే చర్చ జరిగింది. కాని అక్కడ రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతను ఢీకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో మంత్రి మల్లారెడ్డిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తుంది. అయితే తలసాని సాయికిరణ్ యాదవ్ ఓడిపోవడంతో మంత్రి తలసానికి ఇబ్బందే అంటున్నారు.
ఇక నల్గగొండ, భువనగిరిలో టీఆర్ఎస్కు అనుకున్న ఫలితలు రాకపోవడంతో మంత్రి జగదీశ్ రెడ్డికి సమస్యే అంటున్నారు. మరోవైపు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి త్వరలోనే మంత్రి పదవి దక్కుతుందనే చర్చ ఇప్పటికే ఉంది. దీంతో జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిల్లో ఒక్కరికే మంత్రి పదవి ఉంటుందనే చర్చ ప్రగతి భవన్ వర్గాల్లో జరగుతోంది. ఇక కీలకమైన ఉత్తర తెలంగాణలో నిజమాబాద్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్కు నిరాసే ఎదురైంది. కీలక నేతలు ఓడిపోవడంతో ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో ఉన్న మంత్రులు, ముఖ్య నేతల భవిష్యత్తు ఏంటి అన్నది ప్రశ్నర్ధంగా మారింది. మొత్తానికి అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవడంతో ఒకవైపు ఏ నిమిషానికి ఏం జరుగునోనన్న టెన్షన్ ఉన్నా..మరోవైపు మాత్రం మోడీ వేవ్లోనే అనుకున్న సీట్లు రాబట్టుకోలేక పోయామంటున్నారు మంత్రులు.