తెలంగాణ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల బరి నుంచి వైదొలగింది. ఎన్నికల గోదా నుంచి తప్పుకున్న టీటీడీపీ కాంగ్రెస్కు అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. నిన్న మొన్నటి వరకు కనీసం మూడు నాలుగు స్థానాల్లోనైనా పోటీ చేయాలని భావించినా శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఎదురైన చేదు అనుభవం తెలంగాణ టీడీపీ నాయకులను భయపెట్టింది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో లాభ నష్టాలను బేరీజు వేసుకుని చివరికి పోటీ ప్రయత్నాన్ని విరమించుకుంది.
తెలుగుదేశం క్యాడర్ ను కాపాడుకోవటం కోసమైనా మొదట్లో ఎంపీ అభ్యర్థులను పోటీకి దించాలనుకున్నారు. కానీ పోటీ చేసి ఓడటం కంటే తప్పుకుని పరువు కాపాడుకుంటే మంచిదని కొందరు వాదించారు. టీటీడీపీ పోటీ చేస్తే టీఆర్ఎస్కే ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉందని భావించి వెనక్కి తగ్గారు. పైగా టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవాలంటే టీడీపీ పోటీ చేయకూడదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. టీపీసీసీ పెద్దల వినతి మేరకు ఎన్నికలకు దూరంగా ఉండాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రాంత ఎన్నికల్లో పోటీ చేయకపోవటం ఇదే మొదటిసారి. టీటీడీపీ నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంపై కొందరు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. అందరితో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే 17 ఎంపీ స్థానాలకు పోటీ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.