డేటా చోరీ వివాదంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సిట్ అధికారులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సీజ్ చేయగా ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ హైకోర్ట్లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో డేటా వార్ హైకోర్టు మెట్లెక్కింది.
తెలంగాణ సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆఫీస్లోని మిగతా ఎలక్ట్రానిక్ గూడ్స్ను స్వాధీనం చేసుకుని బందోబస్తును ఏర్పాటు చేశారు. మాదాపూర్, ఎస్సార్నగర్ పోలీసులు సోదాలు ముగిశాక సిట్ అధికారులు సీజ్ చేశారు.
ఇటు కంప్యూటర్ల, ల్యాప్ట్యాప్లను అన్లాక్ చేస్తే అసలు విషయం వెలుగులోకొస్తుందని చెబుతున్నారు. దీంతో సైబర్ నిపుణులు, ప్రొఫేషనల్ ఎథికల్ హ్యాకర్స్తో సిస్టమ్స్ను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే కంప్యూటర్లలో ఎలాంటి సమచారాం ఉందనే విషయం బయటపడుతుందని చెబుతున్నారు.
మరోవైపు డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని క్వాష్ పిటిషన్ ధాఖలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం తెలంగాణ సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. టీడీపీ సేవా మిత్ర యాప్ ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఏపీ ఓటర్ల డేటాను మ్యానిపులేట్ చేసిందంటూ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అశోక్ ను విచారించేందుకు నోటీసులతో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా అశోక్ను పట్టుకుంటామంటూ తెలంగాణ సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించడంతో అరెస్ట్ తప్పదని భావించిన అశోక్ 24 గంటల్లోనే హైకోర్టును ఆశ్రయించారు.