ఎండాకాలం వెళ్లిపోనుంది.ఇక వర్షాకాలాన్ని ఆహ్వానిస్తూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంపై రైతులు దృష్టి కేంద్రీకరించారు ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇదివరకు ఎకరానికి 4 వేల రూపాయలు ఇచ్చేవారు. ఇక కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే అది ఐదు వేల రూపాయలకు చేరింది. ఆ క్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక ప్రకటన చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు అయిపోయాక రైతు బంధు సాయం అందిస్తామని ఆయన తెలిపారు. గత రబీ సీజన్ మాదిరిగానే ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి నిధుల సమీకరణ కూడా పూర్తయిందని వివరించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి ఆరు నెలలకు గాను 6 వేల కోట్ల రూపాయలు సమకూర్చామని, ఏడాదికి 12 వేల రూపాయల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. రైతు బంధు సాయం పంపిణీ ఈ నెల చివరి నుంచి ప్రారంభించి జూన్ మొదటి వారంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇదివరకు రైతు బంధు సాయం పంపిణీకి దాదాపు రెండున్నర నెలలు పట్టిందని కానీ ఇప్పుడు అలా జరగకుండా చూస్తామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతుకు వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. అలాగే పంట రుణాల మాఫీ నాలుగు విడతల్లో జరుగుతుందని చెప్పారు. రుణాల మాఫీ విషయంలో అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా నిధుల సమీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికోసం మొదటి ఆరు నెలల కోసం మూడు వేల కోట్ల రూపాయలు సమకూర్చినట్లు వెల్లడించారు.