తెలంగాణ లోక్సభ అభ్యర్థులు సిరిమంతులు...కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆస్తులు రూ.895 కోట్లు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు ఉన్నారు. తాజాగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రమాణ పత్రాల్లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు పేర్కొన్నారు.
సిరిమంతులు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా. అతనికి కుటుంబానికి 895కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. 2014 ఎన్నికలప్పుడు పేర్కొన్న ఆస్తులతో పోలిస్తే 528.52 కోట్ల నుంచి 895కోట్లకు పెరిగినట్లు వెల్లడైంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి దాఖలైన నలుగురు అభ్యర్థులూ కోటీశ్వరులే. జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ పేరిట 126 కోట్ల 91 లక్షల విలువైన ఆస్తులు.. కోటి 15లక్షల మేర అప్పులు ఉనట్లు తెలిపారు. ఇక మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి కుటుంబ ఆస్తి 126కోట్ల65 లక్షలుగా ఉంది. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు పేరుమీద 87 కోట్ల 80 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ కుటుంబానికి 87 కోట్ల 67 లక్షల విలువైన ఆస్తులున్నట్లు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. వివిధ అప్పులు కింద 35 కోట్ల 04 లక్షలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి 58 కోట్ల 63లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.
సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన తలసాని సాయికిరణ్ పేరుమీద 54 కోట్ల 61లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రేవంత్రెడ్డి తన కుటుంబానికి రూ.24 కోట్ల48 లక్షల విలువైన ఆస్తులున్నట్లు ప్రమాణపత్రంలో తెలిపారు. రేవంత్రెడ్డిపై 42 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆయన వద్ద ఒక పిస్టల్, రైఫిల్ ఉన్నాయని ప్రమాణపత్రంలో వివరించారు. మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కోటీశ్వరులు నామినేషన్లు దాఖలు చేశారు.