రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించినా పోలింగ్ను తేలిగ్గా తీసుకోవద్దని నిర్ణయించింది. రేపటి పోలింగ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్గా పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శాసనసభసభా పక్ష సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్ధులు, ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధి రియజ్ ఉల్ హసన్ అఫెందీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్తో పాటు లోక్సభ ఎన్నికలపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలింగ్లో సీరియస్గా పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు. నలుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక ఎంఐఎం అభ్యర్ధి గెలుపుకోసం రెండు సార్లు మాక్ పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్పై ప్రయార్టీ ఓటు ఎలా వేయాలో స్వయంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఎంఐఎం అభ్యర్ధికి రెండో ప్రయార్టీ ఓటు వేయాలని సూచించారు.
ఇక పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారంతట వారే వస్తున్నారన్న గులాబీ బాస్ ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా ఉంటేనే టీఆర్ఎస్లో చేరాలని స్సష్టం చేసినట్లు తెలిపారు. అలాగే మరో రెండురోజుల్లో ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా సిట్టింగ్లకే అవకాశం దక్కుతుందని మూడు నాలుగు చోట్ల మాత్రం అభ్యర్ధుల మార్పు తప్పదని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. అయితే సీటు దక్కని సిట్టింగులకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. బుధవారం నుంచి ఎమ్మెల్యేలంతా లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఆదేశించారు.