స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తీన్మార్ కొట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయఢంఖా మోగించింది. మూడు స్థానాలకు గానూ క్లీన్స్వీప్ చేసింది. ఏ స్థానంలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్, టీఆర్ఎస్కు పోటీ ఇవ్వలేకపోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. మే 31 న జరిగిన ఎన్నికలకు సోమవారం కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 2 వేల 779 ఓట్లకు గాను 98 శాతం ఓటింగ్ నమోదైంది. లెక్కింపు ప్రారంభమైన గంటన్నర లోపే ఫలితాలు వెలువడ్డాయి.
అయితే ఏకపక్షంగా సాగిన కౌంటింగ్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బరిలో మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డిని చిత్తుగా ఓడించారు. ఇటు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి భారీ విజయం నమోదు చేసుకున్నారు. 827 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు. మరోవైపు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి కూడా భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త డల్గా మారిన అధికార పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో సంబరాల్లో మునిగాయి.