ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు యాగాలు, హోమాల హడావుడి సాగుతోంది. గత డిసెంబరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన రాజశ్యామల యాగమే కారణమనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ విజయం కోసం పలు పార్టీల నేతలు యాగాలు, పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. పది రోజుల కిందట నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ చండీయాగం నిర్వహించారు...
తాజాగా, తెలంగాణకు చెందిన బీజేపీ నేత రాజశ్యామల యాగం నిర్వహించారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుతూ ఆయన ఈ యాగాన్ని శనివారం జరిపించారు. మోదీ ప్రధాని కావాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎ.రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో రాజశ్యామల మహా యాగం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారతదేశ ప్రజల ఆకాంక్షతోపాటు భగవంతుడి ఆశీస్సులతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.