కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కాగల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత తిక్కారెడ్డి పలువురిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటు అక్కడికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన అనుచరులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇదే సమయంలో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు.
అయితే తిక్కారెడ్డి గన్మెన్ జరిపిన కాల్పులు మిస్ ఫైర్ అయ్యాయి. లాక్ ఓపెన్ చేస్తూనే గన్ నుంచి బుల్లెట్లు దూసుకువచ్చాయి. దీంతో తిక్కారెడ్డి కాలితో పాటు ఏఎస్ఐ గోపాల్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.