తమకు రక్షణ కల్పించాలంటూ శబరిమలలో దర్శనం చేసుకున్న మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యం సుప్రీం కోర్టులో నేడు విచారణకు రానుంది. ఈ నెల రెండవ తేదిన అయ్యప్పస్వామిని దర్శించుకున్నప్పటి నుంచి తమపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సుప్రీం కోర్టులో ఇరువురు మహిళలు నిన్న పిటిషన్ దాఖలు చేశారు. తమ ప్రాణాలకు రక్షణ కరవైందనీ, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నామని కన్నూర్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న 40 ఏళ్ల బిందు అమ్మిని , ప్రభుత్వ ఉద్యోగిని కనకదుర్గలు పిటిషన్లో పేర్కొన్నారు. వీరిలో కనకదుర్గ ఇప్పటికే ఆమె అత్త చేతిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరి తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం ఈ రోజు వాదనలు వింటామంటూ ప్రకటించింది.