అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇవాళ్టి నుంచి రోజువారీ విచారణ ప్రారంభించనుంది. బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కుదారులెవరో సుప్రీంకోర్టు తేల్చనుంది. ఇందు కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ రాజ్యాంగధర్మాసానాన్ని ఏర్పాటు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ గొగొయ్తో పాటు, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ్టి నుంచి అయోధ్య భూ వివాదం కేసుపై విచారణ జరపనుంది.
అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే, అయోధ్య భూవివాదంపై అత్యవసర విచారణ చేపట్టాలని హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు అప్పీళ్లపై విచారణను తగిన ధర్మాసనానికి నివేదిస్తామని జనవరి నాలుగున జరిగిన విచారణలో స్పష్టం చేసింది.