కాసేపట్లో ఎన్ఐఏ కస్టడీకి కోడికత్తి కేసు నిందితుడు ..
కొడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును కాసేపట్లో ఎన్ఐఏ కస్టడీకి తీసుకోనుంది. కోర్టు ఆదేశానుసారం శ్రీనివాసరావు న్యాయవాది సమక్షంలో సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు.
కొడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును కాసేపట్లో ఎన్ఐఏ కస్టడీకి తీసుకోనుంది. కోర్టు ఆదేశానుసారం శ్రీనివాసరావు న్యాయవాది సమక్షంలో సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నాపత్రం సిద్ధం చేసిన ఎన్ఐఏ బృందం కుట్ర కోణంలో విచారణ జరిపే అవకాశాలున్నాయి.
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ ఇప్పటి వరకు సిట్ సాగించిన విచారణ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. ఘటన జరిగినప్పటికి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలించిన ఎన్ఐఏ బృందం కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు నుంచి అసలు విషయం రాబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే విజయవాడ ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్ఐఏ పిటిషన్ను విచారించిన కోర్టు కేసు దర్యాప్తు కోసం నిందితుడిని అప్పగించాల్సి ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. శనివారం నుంచి వారం పాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు పలు షరతులు విధించింది. నిందితుడు శ్రీనివాసరావుకు ప్రతి మూడు రోజులకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి తమకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలన్న కోర్టు ఎట్టి పరిస్ధితుల్లోనూ థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ఎదుట నిందితుడు శ్రీనివాసరావు ఇప్పటికే వాంగూల్మం ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఎన్ఐఏ విచారణలో పాత విషయాలు మళ్లీ చెబుతాడా లేదంటే కొత్త విషయాలు వెల్లడించి సంచలనాలు రేపుతాడా ? అనేది ఆసక్తిగా మారింది.