ఓ పెళ్లింట హైడ్రామా నడించింది. పెళ్లి కుమారుడికి ఇది వరకే పెళ్లయిందని తెలియటంతో వివాదం చోటుచేసుకుంది. ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో అమ్మాయిని పెళ్లిచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. హాట్టాపిక్గా మారిన ఈ ఘటన జగిత్యాల జిల్లా పోరండ్లలో జరిగింది.
జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్కు పోరండ్లకు చెందిన ఓ యువతితో నిన్న వైభవంగా పెళ్లి జరిగింది. అప్పటి వరకు కుటుంబసభ్యులు, బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న పెళ్లి మంటపంలో సడెన్గా అలజడి రేగింది. అమాయకంగా కనిపించే రాజశేఖర్కు అప్పటికే పెళ్లైందని తెలుసుకుని అమ్మాయి బంధువులు షాక్కు గురయ్యారు.
రాజశేఖర్తో తనకు 2017లోనే పెళ్లి చేసుకున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వరుడి నిర్వాకం బయటపడటంతో వధువు బంధువులు రాజశేఖర్ను గదిలో బంధించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఉట్నూరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.