గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ నకిలీ విత్తనాల చలామణి, రైతు రుణాలు, మద్దతు ధరలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 15న ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మొదటి విడతగా ఒక్కో రైతు కుటుంబానికీ రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.