ప్రసవాలు సరే.. మరణాలను ఆపే మార్గమేది?
నిజామాబాద్ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. కేసీఆర్ కిట్ పథకంపై ఆశతో ఆసుపత్రికి వస్తున్న పేద గర్భిణీలకు మాతాశిశు మరణాలు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
నిజామాబాద్ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. కేసీఆర్ కిట్ పథకంపై ఆశతో ఆసుపత్రికి వస్తున్న పేద గర్భిణీలకు మాతాశిశు మరణాలు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసిఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ తో నిజామాబాద్ జిల్లాలోని సర్కారు ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. అయితే, అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొనే వ్యవస్ధ లేకపోవడం వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి.
గత ఆరు నెలల్లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వందలాది ప్రసావాలు జరగగా, 50మందికి పైగా శిశువులు పురిట్లోనే కన్నుమూశారు. 10 మందికి పైగా బాలింతలు మృతిచెందారు. మాతాశిశు మరణాలపై గర్భిణీల బంధువులు, మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు సుమారు 25 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఆర్మూర్, బోధన్, డిచ్పల్లితో పాటు మోర్తాడ్, వర్ని, నవీపేట ఆస్పత్రులలో మరో 50 వరకు నమోదవుతున్నాయి. నిజామాబాద్ ఆసుపత్రిలో అత్యవసరంగా శిశువులకు అందించే వెంటిలేటర్ సదుపాయం లేకపోవడం, క్రిటికల్ కండీషన్ లో గర్భిణీలు రావడంతో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సర్కారు ఆసుపత్రిలో అత్యవసర పరిస్ధితులను ఎదుర్కొనే వ్యవస్ధను ఏర్పాటు చేసి, మరింత మెరుగ్గా సేవలు అందించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.