గోవా తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోద్ సావంత్ ఎంపికయ్యారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ను సీఎంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ప్రమోద్ సావంత్ సోమవారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు.
మనోహర్ పారికర్ మరణిచడంతో గోవా ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయింది. రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఉన్న తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ గవర్నర్ను కోరింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. పనాజిలో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అమిత్ షా, నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. గోవా కొత్త సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
గోవాలో బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షాలు గోవా ఫార్వార్డ్ పార్టీ, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ తో కలిపి ఆ సంఖ్య 20గా ఉంది. 14మంది శాసన సభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్దపార్టీగా కొనసాగుతోంది. బీజేపీ రెండు మిత్రపక్షాలు ఉప ముఖ్యమంత్రుల పదవులకు పట్టుబడగా బీజేపీ అంగీకరించింది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రమోద్ సావంత్ సోమవారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. పారికర్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న 11 మంది సావంత్తో పాటు మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేశారు. గోవాకు సావంత్ 13వ ముఖ్యమంత్రి. మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ) అధినేత విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ) ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్కు ఉపముఖ్యమంత్రి పదవులు దక్కాయి.