హోటల్‌కు రూ.6 లక్షలు ఎందుకు తెప్పించారు?

Update: 2019-02-02 11:58 GMT

రెండువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..అమెరికా పౌరసత్వం..దేశ విదేశాల్లో వ్యాపారాలు.. ఉభయ తెలుగురాష్ట్రాల్లో బలమైన పరిచయాలు పారిశ్రామికవేత్తగా తనదైన ముద్ర వేసిన చిగురుపాటి జయరాం హత్య కృష్ణా జిల్లా పోలీసులకు సవాలుగా మారింది. జయరాం అమెరికన్ సిటిజన్ కావడంతో కేసు దర్యాప్తుపై అమెరికన్ ఎంబసీ అధికారులు ఆరా తీస్తున్నారు జయరాంను హత్య చేసిన వ్యక్తులు హైదరాబాద్ కు చెందిన వారేనని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అనుమానాలు అనేకమందిపై ఉన్నప్పటికి ప్రాధమికంగా జయరాం మేనకోడలు శిఖా చౌదరినే ఈ కేసులో ప్రధాన అనుమానితురాలని పోలీసులు భావిస్తున్నారు జయరాం హత్యకు ఆర్ధిక లావాదేవీలు,వ్యక్తిగత కారణాలు కారణం కావచ్చని అంచనాకు వచ్చారు పోలీసులు. పాయిజన్ ఇంజక్షన్ ద్వారా జయరాం మరణం సంభవించిందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తును నందిగామ పోలీసులు వేగవంతం చేశారు. నాలుగు టీమ్ లుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు. జయరామ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన మేనకోడలు శిఖా చౌదరిని ఈ కేసులో అనుమానితురాలిగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఫిబ్రవరి ఒకటో తేది రాత్రి హైదరాబాద్ కు పోలీసులు వచ్చారు. జూబ్లిహిల్స్ లోని జయరాం ఇంటి వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డుల స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. జనవరి 30 మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చిన జయరామ్ రేపు ఉదయం విజయవాడకు వెళ్లాలని తన కారు డ్రైవర్ , సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. గంట తర్వాత ఇంట్లోంచి నుంచి హడావిడిగా జయరామ్ కారు తీసుకుని బయటకు వెళ్లారు.

ఇంట్లోంచి బయటకు వచ్చిన జయరామ్ హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. ఓ మహిళా యాంకర్ పేరిట ఉన్న గదిలో ఉన్నారు. సాయంత్రం తన సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఫోన్ చేసి 6 లక్షల రూపాయలు తెప్పించుకున్నారు. ఆ తర్వాత హోటల్ నుండి జయరామ్ మరో వ్యక్తి తో కలిసి కారులో బయటికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

జయరామ్ ఆరులక్షల రూపాయలను ఎందుకు తెప్పించుకున్నారు? ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు? అన్న విషయాలు తెలుసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దసపల్లా హోటల్ సిసి కెమేరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు .

జనవరి 31 వ తేది అర్ధరాత్రి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జయరామ్ మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు అనగా 30వతేది సాయంత్రం నుంచి 31వ తేది రాత్రి వరకు జయరామ్ ఎక్కడున్నారు , ఎవరితో ఉన్నారు? జయరాం మృతదేహం లభించిన కారును నడిపిన వైట్ షర్ట్ వ్యక్తి ఎవరు? కారు వెనుక సీట్లో జయరాంతో కూర్చున్నది శిఖా చౌదరియా లేదా మరో వ్యక్తియా ? కారులో మరెవరైనా ఉన్నారా అనే విషయాలపై పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. 

Similar News