గత ఐదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ఆస్తులు 52 శాతం పెరిగాయి. నామినేషన్ సందర్భంగా మోడీ నిన్న సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ 2 కోట్ల 51 లక్షలుగా చూపించారు. వాటిలో చరాస్తుల విలువ ఒక కోటీ 41 లక్షల 36 వేల 119 రూపాయలుగా స్థిరాస్తుల విలువ కోటీ 10 లక్షలుగా చూపించారు. ప్రధాన ఆదాయ వనరుగా నెల నెలా అందుకునే జీతంతో పాటు బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ అని తెలిపారు. స్టేట్ బ్యాంకులో కోటీ 27 లక్షల మేర డిపాజిట్లు ఉన్నాయని బ్యాంక్ బ్యాలెన్స్ 4 వేల 143 రూపాయలుగా చూపించారు. అలాగే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న నగదు 38 వేల 750 రూపాయలుగా చూపించారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న ఇంట్లో వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆయనకు ఒక్క రూపాయి కూడా అప్పులేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే ఎలాంటి క్రిమినల్ కేసును ఎదుర్కోవడం లేదని వివరించారు. 1978 లో దిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా, 1983 లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి పీజీ పట్టా పొందినట్లు నామినేషన్ పత్రాల్లో పొందుపర్చారు.