అభినందన్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దేశం యావత్తు కీర్తిస్తున్న అభినందన్.. అసలు పాకిస్తాన్లోకి ఎలా అడుగుపెట్టాడు..? దాయాది నేలపై వాలే ముందు.. ఆకాశంలో జరిగిన అద్భుతం ఏంటి..? గగనతలంలో అభినందన్ ఎలాంటి పోరాటం చేశాడు..?
అప్పటికే ఎయిర్ స్ట్రైక్స్ ముగిసి.. 24 గంటలు దాటింది. సరిహద్దులో ఉద్రిక్తతతో పాటు.. దేశంలో తీవ్ర ఉద్విగ్నత పరిస్థితి. పుల్వామా ఘటనకు ధీటైన సమాధానం చెప్పామన్న సంతోషంలో ఉన్న భారతావనికి.. తెల్లవారే సరికి షాక్. మన వింగ్ కమాండర్ దాయాది సైన్యానికి చిక్కాడని. అతనే వర్థమాన్ అభినందన్. అయితే పాకిస్తాన్కు చిక్కేకంటే ముందు.. ఆ రోజున గగనతలంలో అద్భుతమైన పోరాటం జరిగింది. ఆ సమయంలో అభినందన్ చూపించిన ధైర్యసాహసాలు అబ్బుపర్చాయి.
ఎయిర్స్ట్రైక్స్పై తీవ్ర ఆందోళనలో ఉన్న పాకిస్తాన్ ఏకంగా 24 విమానాలు మనదేశంపైకి పంపించింది. 8 ఎఫ్-16 లు, 4 మిరాజ్-3 లు, 4 చైనా తయారీ జేఎఫ్-17 తో పాటు మరో 8 ఫైటర్లు మనదేశ గగనతలంపైకి పంపించింది. దీంతో పాక్కు చెందిన ఫైటర్ జెట్లు మన గగనతలంలోకి రావడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న మనదేశ సైన్యం 8 ఫైటర్లతో వాటిని నిలువరించే ప్రయత్నం చేసింది. పాక్కు చెందిన చాలా జెట్లు తోకముడిచి వెనక్కు మళ్లాయి. నింగిలోనే హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధంలో పాక్కు చెందిన ఎఫ్ - 16 ఫైటర్ జెట్ను మిగ్ -21 జెట్తో మన అభినందన్ కూల్చేశాడు.
మిగ్-21 లో ఉన్న అభినందన్ తొలుత పాక్కు చెందిన ఎఫ్ - 16 కు గురిపెట్టాడు. రాడార్తో లాక్ చేసి దాన్ని వెంటాడాడు. నింగి నుంచి నింగిలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే ఆర్-73 క్షిపణిని ప్రయోగించాడు. అంతే ఎఫ్ - 16 విమానాన్ని నేలకూలింది. అయితే శత్రువిమానాన్ని వెంటాడే క్రమంలో అభినందన్ నియంత్రణ రేఖ దాటాడు. అదే సమయంలో పాక్లో ఉన్న మరో ఎఫ్-16 విమానం అభినందన్ ఉన్న మిగ్-21 ని క్షిపణితో పేల్చారు. దీంతో పారాచూట్ సాయంతో అభినందన్ సేఫ్గా నేలకు దిగాడు.
అయితే అభినందన్ దిగింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో. తానెక్కడున్న విషయాన్ని తెలుసుకునేందుకు అభినందన్ స్థానికులను ప్రశ్నించాడు. తొలుత ఇండియా అని చెప్పిన స్థానికులు అభినందన్పై రాళ్లతో దాడి చేశారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ.. అభినందన్ను తీవ్రంగా కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అభినందన్ తన జేబులో ఉన్న రైఫిల్ను తీసుకొని గాల్లోకి కాల్పులు జరుపుతూ దాదాపు అరకిలోమీటర్ వరకు పరుగులు పెట్టాడు. అయినా వారంతా వెంటపడి మరీ అభినందన్పై రాళ్ల దాడి చేశాడు.
వారి నుంచి తప్పించుకున్న అభినందన్ మొదట తన దగ్గరున్న మ్యాప్లు, ఇతర పత్రాలను నమిలిమింగేశాడు. అప్పటికే స్థానికులు అభినందన్ను చుట్టుమట్టారు. కాళ్లు చేతులతో దాడి చేస్తున్నారు. అటుగా వచ్చిన పాకిస్తాన్ సైనికులు అభినందన్ను అదుపులోకి తీసుకున్నారు. అలా దాయాది చేతిలో అభినందన్ వర్ధమాన్ చిక్కుకున్నాడు. శత్రువల చేతిలో ఉన్నా తన ప్రాణాలు పోతాయని తెలిసినా వెన్నుచూపకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్కు భారత్ సెల్యూట్ చేస్తోంది.