డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి గా పద్మారావు నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవానికి ప్రతి పక్షాలు మద్దతివ్వటంతో డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ఎన్నిక లాంచనప్రాయమే కాబోతుంది. సోమవారం డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ను స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. మద్దతిచ్చే ముందు ఒక ఎమ్మెల్సీ సీటును తమకు వదిలేయాలని కాంగ్రెస్ కండీషన్ పెట్టింది.
డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ తరుపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు అభ్యర్దిని నిలబెట్టేంత బలం సభ లో లేకున్నా అందరిని కలసి డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని పార్టీల నేతల మద్దతుతో పద్మారావు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నర్శింహా చార్యూలుకు అందించారు పద్మారావు.
అంతకుముందు కాంగ్రెస్ నేతలతో కేటీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సీఎల్పీలో సీఎల్పీ లీడర్ భట్టి విక్ర మార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో భేటీ అయిన కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన 5 సీట్లలో ఒకటి తమకు వదిలేయాలని తమ సభ్యులు 19 మంది టీడీపీతో కలిసి తమకు 21 సభ్యుల బలం ఉందని కాంగ్రెస్ నేతలు కేటీఆర్ తో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని తమ అధ్యక్షుడు కేసీఆర్ తోనే మాట్లాడాలని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం.
అయితే మిత్ర పార్టీ ఎంఐఎం అభ్యర్థితో కలిపి మొత్తం 5 గురిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలుపుతున్నట్లు కేటీఆర్ చిట్ చాట్ లో చెప్పారు. ఒక వేళ కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపినా 5 కు 5 స్థానాలు తమ అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ఙిని పెట్టాలా వద్దా అనేది కాంగ్రెస్ టీడీపీలే నిర్ణయించుకోవాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈనెల 25 న తమ 5 గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు కేటీఆర్.