తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సోమవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డ్లో అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ABVP విద్యార్ధి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్ లోపలికి వెళ్లే చెక్ పాయింట్ దగ్గర ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు ,విద్యార్ధి సంఘాల నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యార్ధులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులు గాయపడ్డారు.