భవిష్యత్ కార్యాచరణపై ఎన్డీఏ యేతర పక్షాలు స్పీడు పెంచాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన విపక్ష నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ప్రణాళికపై చర్చించారు. ఈవీఎంలపై వ్యక్తమవుతున్న అనుమానాల గురించి దృష్టి పెట్టారు. ఈవీఎంల అంశంపై సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో 'సేవ్ ది నేషన్-సేవ్ డెమోక్రసీ' పేరుతో ఎన్డీఏయేతర పక్షాలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ , నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, సీపీఐ నేత, డి.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు 25 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. దేశ రాజకీయ పరిణామాలతో పాటు వచ్చే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనే వ్యూహంపై చర్చించారు.
ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే సభల గురించి నేతలు చర్చించారు. ఈవీఎంలపై విపక్షాలు ఏర్పాటు చేసుకున్న సబ్ కమిటీ నివేదికను చర్చించి ఆమోదించారు. ఈవీఎంలపై ఉన్న సందేహాలు గురించి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వివరించాలని నిర్ణయించారు. ఈవీఎంలకు సంబంధించిన డాక్యుమెంట్ను ఎన్నికల సంఘానికి అందజేస్తామని రాహుల్, చంద్రబాబు ప్రకటించారు.
ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఈవీఎంల గురించి విపక్షాల అభిప్రాయాలను అధికారులకు వివరించారు. ఈవీఎంలపై రాజకీయ పక్షాలతో పాటు ప్రజలకు కూడా అనేక అనుమానాలున్నాయని సీఈసీ అధికారులకు చంద్రబాబు చెప్పారు. అటు సేవ్ ది నేషన్ -సేవ్ డెమోక్రసీ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేకపోవడంతో ఆయనను సీఎం చంద్రబాబును విడిగా కలిశారు. ఎన్డీఏ వ్యతిరేక పార్టీల భేటీలో చర్చించిన అంశాల గురించి కేజ్రీవాల్ కు వివరించారు. మరోసారి జరిగే ఎన్డీఏయేతర పక్షాలు సమావేశంలో ఇతర సమస్యల గురించి చర్చిస్తామని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు చంద్రబాబుతో తెలుగుదేశం ఎంపీలు సమావేశమై కేంద్ర బడ్జెట్ గురించి చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంతనాలు జరిపారు. ఢిల్లీలో చేపట్టాల్సిన ఆందోళనలు, ఈ నెల 11న చంద్రబాబు హస్తిన వేదికగా చేసే దీక్ష గురించి చర్చించారు.