తెలంగాణ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్మిక విభాగం జెండా ఎగురవేశారు. పరిశ్రమలు రావడమే కాదు కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ విధానమని అన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతన్న కేటీఆర్ అన్ని వర్గాల జీతాలను పెంచిన ఘనత ఆయనదేనన్నారు. విపక్షాలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన గందరగోళం తనను కూడా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ఐటీ శాఖకు, ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధం ఉండదని తెలిపారు. ఇంటర్ ఫలితాల విషయంలో విపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయన్నారు. రూ.4 కోట్ల టెండర్కు రూ.10వేల కోట్లు ఎవరైనా లంచంగా ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలను అవసరమైతే కోర్టుకు లాగుతామన్నారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.