రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన టీటీడీ బంగారం తరలింపు వివాదంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా టీటీడీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు చుట్టూనే తిరుగుతున్న ఈ వ్యవహారంలో కొత్తగా ఎ.ఎన్.జెడ్. అనే బ్యాంకు పేరు తెరపైకి వచ్చింది. ఈ బ్యాంక్ పేరును స్వయంగా టీటీడీ ఈవో వెల్లడించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
18 ఏప్రిల్, 2016 లో మూడేళ్ల కాలపరిమితితో 1,311 కేజీల బంగారాన్ని టీటీడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. గత నెల ఏప్రిల్ 18న మెచ్యూరిటీ తీరడంతో బంగారాన్ని టీటీడీ ఖజానాకు చేర్చాలని అధికారులు బ్యాంక్ కు లేఖ పంపారు. ఇక్కడే ఆసలు వ్యవహరం మొదలైంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కోసం ఎఎన్జెడ్ బ్యాంకు బంగారం తీసుకొచ్చిందని, చెన్నైలో కస్టమ్స్ వ్యవహారాలన్నీ పూర్తి చేసిన తరువాత ఒక లాజిస్టిక్ సంస్థ ద్వారా తిరుపతికి తరలిస్తుండగా మధ్యలో పోలీసులు పట్టుకున్నారని ఈవో చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఇటు టీటీడీకిగానీ, అటు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఆ బంగారు రవాణా, భద్రత వంటి విషయాలన్నీ ఎఎన్జెడ్ బ్యాంకుదే అని తేల్చి చెప్పారు.
గత నెల 23న ఈ బంగారం విషయమై మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో ఎక్కడా ఎఎన్జెడ్ బ్యాంకు ప్రస్తావవ చేయలేదు. గత శుక్రవారం తిరుమలలో డయల్ యువర్ ఈవో అనంతరం మీడియా సమావేశంలో విలేకరులు బంగారం వివాదాన్ని ప్రస్తావించినపుడు ఎఎన్జెడ్ బ్యాంకు పేరును ప్రస్తావించారు టీటీడీ ఈవో.
బంగారం వివాదం టీటీడీ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన విషయమని చెప్పిన ఈవో ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కూడా సంబంధం లేదని చెప్పడంలోని మతలబు ఏమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు వివాదంపై సీఎస్ వేసిన ఎంక్వైరీకి పూర్తిగా సహకరించి, వాస్తవాలను ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ కు వివరించాను అని టీటీడీ ఈవో చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ ఏం నివేదిక ఇచ్చిందో తనకు తెలియదు అంటున్నారు. టీటీడీ బంగారం తరలింపులో తలెత్తిన అనుమానాలు నివృత్తి కావాలంటే మన్మోహన్ సింగ్ నివేదిక బయట పెట్టాల్సిన అవసరముంది.