ఊడిపోయిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు

Update: 2019-02-09 05:04 GMT

ప్రయాణీకుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన ఆర్టీసీ ప్యాసింజర్లను ఆదాయ వనరుగా భావిస్తూ భద్రతను విస్మరిస్తోంది. కాలం చెల్లిన బస్సులతో పాటు సరైన ఫిట్‌నెస్ లేని బస్సులను రోడ్లపైకి పంపుతూ చేజేతులా ప్రమాదాలకు కారణమవుతున్నారు ఆర్టీసీ అధికారులు. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటన మూసాపేట్‌ సమీపంలో జరిగింది. లింగంపల్లి నుంచి బస్సు బయలుదేరి పది కిలోమీటర్లు కూడా రాక ముందే వెనక టైర్ల వీల్ బోల్టాలు ఊడిపోయాయి. టైర్లు బయటకు రావడంతో ప్రయాణీకులు పెద్ద ఎత్తున హాహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. దీంతో డ్రైవర్ బస్సును పరిశీలించారు. అప్పటికి టైర్లు పూర్తిగా బయటకు రావడంతో డిపో ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల వరకు మూసాపేట్ బ్రిడ్జిపైనే ప్రయాణీకులు పడిగాపులు కాశారు. రాత్రి రెండు గంటల సమయంలో మరో బస్సును ఏర్పాటు చేయడంతో ప్రయాణీకులు విజయవాడ బయలుదేరారు.  

Similar News