రాష్ట్ర హక్కులపై దృష్టి సారించింది అధికార పార్టీ వైసీపి. హోదా సాధన కోసం ప్రత్యేక వ్యూహాలు రచించడంలో నిమగ్నమైంది. 22 పార్లమెంటు స్థానాలు గెలవడంతో ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో బలమైన నేతలను పార్లమెంటరీ పార్టీ నేతలుగా నియమించారు జగన్.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం సహకారం చాలా ముఖ్యం. ముఖ్యంగా విభజన హామీలు అమలుతో పాటు రాష్ట్రానికి ఆర్ధిక లోటు భర్తీ, ప్రత్యేక హోదా సాధన, అమరావతి నిర్మాణం పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు వంటి అంశాల్లో కేంద్రంపై వత్తిడి తేవాల్సిన పరిస్థితి వీటన్నింటినీ సాదించాలంటే ఢిల్లీలో గట్టి పోరాటం చెయ్యాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో వైసీపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ కీలక నేతల విజయసాయిరెడ్డిని నియమించారు జగన్. లోక్ సభలో పార్టీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని నియమించారు. ఇక పార్లమెంట్లో పార్టీ విప్గా రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ను నియమించారు జగన్. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖకు లేఖ ద్వారా తెలిపారాయిన.
ఇదిలా ఉంటే సిఎం స్థాయిలో జగన్ నేరుగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాదన వంటి అంశాలపై నేరుగా కేంద్రంపై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రదాని మోడితో చర్చించిన జగన్ మరోసారి ఈ విషయంపై ప్రధానితో మాట్లడనున్నారు. ఈ నెల 9 తేదిన తిరుపతికి ప్రధాని రాబోతున్నారు. ఈ పర్యటనలో మోడిని కలిసి మరోసారి హోదా అంశంతో పాటు విభజన హామీలు, ఆర్ధిక లోటు భర్తి వంటి అంశాలపై చర్చించనున్నారు. దీనితో పాటు ఈ నెల 14 తేదిన నీతి ఆయోగ్ సమావేశం వేదికగానూ వీటిపై గళమెత్తనున్నారు సిఎం జగన్. ఓ పక్క పార్లమెంట్ లో కేంద్రం పై వత్తిడి తెస్తూనే మరో పక్క రాజకీయంగానూ కేంద్రంపై వత్తిడి తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు సిఎం జగన్. సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో వేచి చూడాలి మరి.