రాజకీయాల్లో ఓటర్లను ఆకర్షించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ఇంటింటా వీధివీధిలో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఒకరు రిక్షా తొక్కుతూ ఓటర్లను ఆకర్షిస్తే, మరొకరు ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అర్థిస్తూ ఉంటారు.
ఎన్నికల ప్రచారంలోనూ వింతలు విచిత్రాలు స్టయిల్ ఈ పదాలు వినగానే రాష్ట వ్యాప్తంగా అందరికి గుర్తుకు వచ్చేది స్టయిల్ ఆఫ్ సింహపురిగా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకొన్న దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందారెడ్డి భౌతికంగా ఆయన దూరమైనా ఆయన స్ఫూర్తితో ఓటర్లను ఆకర్షించేందుకు నేటితరం యువనాయకులు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాదు నెల్లూరు అర్బన్ సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి నారాయణ, ఆయన భార్య, కుమార్తె సైతం వీధి వీధి, గుమ్మం గుమ్మం తిరుగుతూ ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
నారాయణ సతీమణి రమాదేవి ప్రచారంలో కీలక భూమిక పోషిస్తోంది ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన రమాదేవి ఎన్నికల ప్రచారంలో మాత్రం తనదైన రీతిలో ఓటర్లను కలుసుకొంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు నారాయణ కుమార్తె, డాక్టర్ సింధూర సైతం ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సింధూర తనతండ్రి విజయం కోసం ఎన్నికల ప్రచారంలో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. నెల్లూరు సిటి పరిధిలోని అన్ని డివిజన్లను చుట్టేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు అక్కడక్కడ దోశలు పోస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
గత ఐదేళ్ల కాలంలో తన తండ్రి చేసిన అభివృద్ధిని ఓవైపు వివరిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఆయన చేపట్టబోయే అభివృద్ది పనులేంటో వివరించి చెబుతున్నారు. సింధూర ప్రచారం చేస్తున్న తీరు పట్ల నగరవాసులు ఆకర్షితులవుతున్నట్లే కనిపిస్తున్నారు. నారాయణ భార్య, కుమార్తే మాత్రమే కాదు నారాయణ సోదరుడు, మరోకుమార్తె గంటా శరణ్య ఇలా మొత్తం కుటుంబసభ్యులు ప్రచారంలో తమవంతు పాత్రనిర్వర్తిస్తున్నారు.
ఎప్పుడో కానీ కనిపించని మంత్రి నారాయణ కుటుంబసభ్యులు అందరూ తమ ముంగిట్లోకి వచ్చి ఓటు వేయాలంటూ అభ్యర్ధించడం చూసి నగర వాసులు ఔనా నిజమేనా అనుకొని ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు వారుపడుతున్న కష్టం చూసి ఇదంతా ఎన్నికల మహిమే అంటూ సర్థి చెప్పుకొంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ ముగిసే వరకూ ఓటరే మారాజు నాయకులు ఎంతగొప్పవారైనా ఓటరు మారాజుకు దండం పెట్టాల్సిందే ఓట్లు అభ్యర్థించాల్సిందే మరి.