మరో మలుపు తిరిగిన రాజంపేట పంచాయితి...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో మేడా
రాజంపేట నుంచి అమరావతికి చేరిన రాజంపేట పంచాయితి మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీ విప్గా ఉన్న రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మేడా సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరే యోచనలో ఉన్నట్టు సమాచారం. 2014లో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి మేడా ఒక్కరే విజయం సాధించారు. పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నసమయంలో వైసీపీ అధినేత జగన్ను మేడా కలవడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.