నాలుగో విడత పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 8 రాష్ట్రాల పరిధిలోని 71 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు , జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్లలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ల దగ్గరకు చేరుకున్నారు. పలు చోట్ల వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తొలి మూడు విడతల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ బెంగాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడతలో మొత్తం 8 స్ధానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. దీంతో పాటు బీహార్లో ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మొత్తం 72 నియోజకవర్గాల్లో 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 961 మంది అభ్యర్ధుల భవితను నాలుగో విడత ఎన్నికలు నిర్ధేశించనున్నాయి.
పోలింగ్ ప్రారంభం కాగానే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలో ఓటు వేశారు. రాజ్యసభ సభ్యురాలు రేఖ ముంబైలో, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి జైపూర్లో, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ బీహర్లోని బేగుసరాయ్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.