ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది మద్యం ఏరులై పారుతోంది. ఈసీ ఎంతగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా లిక్కర్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపిన పార్టీలు వాటిని తరలిస్తున్నాయి. ఈ క్రమంలో భారీగా మద్యం పట్టుబడుతోంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే యత్నాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. మద్యం విక్రయాలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని, ఏరోజు కారోజు మద్యం క్రయ, విక్రయాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈసీ ఆబ్కారీశాఖను ఆదేశించింది.
ఈ 11 న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మద్యం, మత్తు పదార్థాల రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు చోట్ల గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను పట్టుకున్న అధికారులు.. పెద్దమొత్తంలో అక్రమ మద్యం సీజ్ చేశారు. ఇటు మంగళవారం నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో లిక్కర్ను సీజ్ చేశారు. ఆత్మకూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఎన్నికల ప్రచారం సమయం ముగిసినా మద్యం అమ్మకాలు జరుపుతున్న వైన్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. సాయంత్రం 5 గంటలు దాటినా హైదరాబాద్ లక్డీకాపూల్లోని న్యూ డింపుల్ వైన్ షాపు మద్యం అమ్మకాలు జరుపడంతో అధికారులు షాపును సీజ్ చేశారు. వరుసగా మూడు రోజులు వైన్ షాపులు బంద్ కావడంతో దుకాణాల ముందు మద్యం ప్రియులు భారీగా క్యూ కట్టారు. దీంతో 5 గంటలు దాటినా షాపులు క్లోజ్ చేయకుండా అమ్మకాలు జరపడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం కొనుగోలు చేసినా, నిల్వ చేసుకున్నా వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించింది. ఎన్నికల యాక్షన్ప్లాన్లో భాగంగా24/7 పనిచేసే విధంగా ప్రత్యేక కంట్రోల్రూంను ఏర్పాటు చేసింది. మరోవైపు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.