ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ పాక్ మిలిటరీకి చిక్కిన ఘటన భారతీయుల హృదయాలను కలచివేస్తోంది. పాక్ ఆర్మీ చిత్రహింసలు పెడుతున్న వీడియోలు వైరల్ కావడంతో అభినందన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు అభినందన్ను హింసించడం అమానుషమన్న భారత ప్రభుత్వం జెనీవా ఒప్పందం మేరకు సురక్షితంగా అప్పగించాలంటూ డిమాండ్ చేసింది.
భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో మిగ్-21 ఫైటర్ పాకిస్థాన్లో కూలిపోయింది. దాంతో అందులో ఉన్న IAF పైలట్ అభినందన్ను పాకిస్థాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత అభినందన్ను హింసిస్తూ పాక్ సైనికులు వీడియోలు రిలీజ్ చేసింది. దాంతో అభినందన్ పరిస్థితిపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సేమ్ టు సేమ్ అభినందన్ లాంటి ఇన్సిడెంటే సరిగ్గా 20ఏళ్ల కిందట జరిగింది. 1999లో కార్గిల్ వార్కి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన పైలట్ నచికేత అభినందన్లాగే పాక్ ఆర్మీకి చిక్కారు. నచికేత నడిపిన విమానం ఇంజిన్ ఫెయిలై పాకిస్థాన్ సరిహద్దుల్లో కూలిపోయింది. ప్రాణాలతో బయటపటిన నచికేత పాక్ ఆర్మీకి చిక్కారు. దాంతో భారత సైనిక రహస్యాలు చెప్పాలంటూ నచికేతకు నరకం చూపించారు పాక్ సైనికులు. వాళ్లు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఒక్క రహస్యమూ బయటపెట్టలేదు నచికేత. 1999 జూన్ 3వరకు నచికేత యుద్ధ ఖైదీగా ఉన్నారు. అప్పటి భారత ప్రభుత్వం వివిధ దేశాల ద్వారా పాకిస్థాన్పై ఒత్తిడి తెచ్చింది. దాంతో అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్, నచికేతను విడిచిపెట్టింది. సైనిక రహస్యాలు చెప్పకుండా ధైర్యం ప్రదర్శించిన నచికేత అప్పట్లో ఎయిర్ ఫోర్స్ మెడల్ పొందారు.
అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం ద్వారా నచికేతను విడిపించుకున్న భారత్ అభినందన్ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి కూడా ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాలున్నాయి. నాడు భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 8రోజుల తర్వాత నచికేతను పాక్ వదిలిపెట్టింది. మరి ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు చెబుతున్న పాక్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం అభినవ్ను విడిచిపెడుతుందా? భారత్ ఎలాంటి వ్యూహంతో పైలట్ను తిరిగి తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే. ఏదిఏమైనా అభినందన్ పాక్లో సురక్షితంగా, ఎలాంటి హింసకు గురికాకుండా ఉండాలంటే జెనీవా ఒప్పందం ఒక్కటే ఆశాదీపంలా కనిపిస్తోంది.