మలుపు తీసుకున్న బావ బావమరుదుల సవాల్‌

Update: 2019-04-02 01:31 GMT

బావ బావమరుదుల సవాల్‌.. సరికొత్త మలుపు తీసుకుంది. ఫలితాలపై తమదే పై చేయి అంటూ విసురుకున్న ఛాలెంజ్‌ మరో టర్న్‌ తీసుకుంది. మెదక్‌, కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల మెజార్టీపై నువ్వా నేనా అన్న కేటీఆర్‌ కాస్త వెనక్కితగ్గారు. గతంలో హరీశ్‌రావుకు చేసిన సవాల్‌పై తాజాగా కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ మరోసారి ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

గతంలో మెదక్‌ పార్లమెంట్‌ సన్నాహక సభలో బావ బావమరుదులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు విసురుకున్న సవాల్‌ గుర్తుండే ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎవరితో పోటీ లేదని ఇతర నియోజకవర్గాల్లో మెజార్టీలో తమకు తామే సాటి అని చెబుతూ మెదక్‌ కంటే కరీంనగర్‌లోనే ఎక్కువ మెజార్టీ వస్తుందని సవాళ్లు విసురుకున్నారు.

ఆనాటి సవాల్‌ను మరోసారి గుర్తుచేసిన కేటీఆర్‌ ఇప్పుడు నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి సునితా లక్ష్మారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో సమీకరణాలు మారాయని చూస్తుంటే మెదక్‌లోనే భారీ మెజార్టీ ఖాయం అని అన్నారు. సునితా లక్ష్మారెడ్డి చేరికలో తనకు కూడా వాటా ఉందన్న కేటీఆర్‌ ఫలితాల్లో తనకు క్రెడిట్‌ కావాలని కోరారు. కేటీఆర్‌ మాటలతో ఆ ప్రాంగణం నవ్వులమయం అయ్యింది. మొత్తానికి మెదక్‌లోనే ఎక్కువ మెజార్టీ వస్తుందని కేటీఆర్‌ తన మనస్సులో మాట చెప్పుకొచ్చారు. 

Similar News