ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. రాజీనామాకు ముందు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ను కిడారి కలిశారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై లోకేష్తో కిడారి శ్రవణ్ చర్చించారు. కాగా గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కిడారి శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. ఈనెల 10వ తేదీతో ఆరునెలల గడువు ముగియడం ఇప్పటి వరకూ ఏ సభలోనూ శ్రవణ్ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు స్థానం నుంచి ఆయన పోటీ చేశారు.