టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ రాజకీయాలను స్పీడప్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తెచ్చిన కేసీఆర్. ఆ దిశగా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవలే కేరళ సీఎం పినరయి విజయన్తో సమావేశమై చర్చలు జరిపిన కేసీఆర్ ఇవాళ డీఎంకే అధినేత స్టాలిన్తో భేటీకానున్నారు.
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వస్తున్నవేళ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దేశ రాజకీయాలపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమంటోన్న కేసీఆర్, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనరల్ ఎలక్షన్స్లో ఇంకా చివరి దశ మాత్రమే మిగిలి ఉండటంతో, ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను వేగవంతం చేశారు. గతంలో మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్, కుమారస్వామి, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ తదితరులను కలిసి చర్చలు జరిపిన కేసీఆర్... ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్పై చర్చలు జరిపారు.
ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ డీఎంకే అధినేత స్టాలిన్తో సమావేశం కానున్నారు. స్టాలిన్తో భేటీలో దేశ రాజకీయాలు, సార్వత్రిక ఎన్నికల అనంతరం తలెత్తే రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, ఈసారి కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యంపై కీలక చర్చలు జరపనున్నారు. గతవారం తమిళనాడు పర్యటనలో స్టాలిన్తో భేటీకి కేసీఆర్ ప్రయత్నించారు. అయితే స్టాలిన్ ఉపఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో భేటీ సాధ్యంకాలేదు. ఆదివారంతో ఉపఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇవాళ భేటీ కావాలని కేసీఆర్ను స్టాలిన్ ఆహ్వానించారు. దాంతో ఈరోజు కేసీఆర్-స్టాలిన్ మీటింగ్ జరగనుంది.