స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డికే ఛాన్స్ ?
తెలంగాణ శాసనసభా సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ శాసనసభా సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ముంతాజ్ అహ్మద్ఖాన్తో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పలువురు టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ అహ్మద్ఖాన్ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ స్పీకర్ ఎవరన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి (69) రాష్ట్రానికి రెండో స్పీకర్ కానున్నారు. సీఎం కేసీఆర్ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి పోచారంతో మాట్లాడిన సీఎం.. నేడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అంతేకాదు, నేడే ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించనున్నారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు సంభవిస్తే పద్మాదేవేందర్ రెడ్డి, లేదంటే ఇంద్రకరణ్ రెడ్డిలలో ఒకరితో నామినేషన్ వేయించనున్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ ప్రతిపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లు చేసి విజ్ఞప్తి చేశారు. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని కోరారు.