ఏపీ కేబినెట్ రూపకల్పనలో తన మార్క్ చూపించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇవాళ మొదటిసారిగా సెక్రటేరియట్లో అడుగుపెట్టబోతున్నారు. ఉదయం 8.39 గంటలకు షెడ్యూల్ ఖరారైంది. సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్లో ఆఫీస్ కు చేరుకుని తన సీట్లో కూర్చోబోతున్నారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో జగన్ సమావేశం అవుతారు. ఆ సమయంలో... కొద్ది మంది పార్టీ నేతలు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పనున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సచివాలయం దగ్గర్లోనే ప్రాంగణంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ఠమైన పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. విజయవాడలో బస చేసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్...వైసీపీ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొత్తం 25 మంది ఎమ్మల్యేలు ప్రమాణం చేయనున్నారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్, ముఖ్యమంత్రితో కలసి గ్రూపు ఫొటో దిగుతారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాల అమలు, త్వరలో అమలు చేయబోతున్న స్కీంలు, రైతుల కోసం నిధుల కేటాయింపులు.. రాష్ర్టంలోని ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాలపై చర్చించడంతో పాటు కొన్ని పనులకు ఆమోదం తెలపనున్నారు.