జగన్ లండన్ టూర్ పై రాజకీయ దుమారం

Update: 2019-02-23 10:23 GMT

జగన్ లండన్ టూర్ వెనుక వేరే ప్లాన్‌ ఉందా? టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ వెళ్లారా..? సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ విదేశీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది.

వైసీపీ అధినేత జగన్ కోర్టు అనుమతితో కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లారు. వాస్తవానికి లండన్ లో చదువుకుంటున్న తన కూతురు దగ్గరికి వెళ్తున్నట్లు జగన్ చెబుతున్నప్పటికీ. రాజకీయ విమర్శలు దుమారం లేపుతున్నాయి. హవాల డబ్బుల కోసమే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆరోపించడం కలకలం రేపింది.

ఇన్నాళ్లు ప్రతిపక్ష పార్టీ విమర్శలను అంతగా పట్టించుకోని చంద్రబాబు జగన్ లండన్ టూర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్భంగా డబ్బు ఏర్పాటు చేసుకునేందుకే విదేశీ పర్యటనకు వెళ్లారని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇటు జగన్ లండన్ టూర్ పై బీజేపీ స్పందించింది. లండన్ లో ఉన్న బిడ్డను చూసేందుకు ప్రతిపక్ష నేత వెళ్తే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. జగన్ డబ్బు ఏర్పాటు చేసుకోవడం కోసం లండన్ వెళ్తే టీడీపీ నాయకులు కూడా విదేశీ పర్యటనలు చేసేది డబ్బు సమకూర్చుకోవడానికేనా అని ప్రశ్నించారు. మంత్రులు ఏ ఏ సందర్భాల్లో ఏఏ దేశాలకు వెళ్లారో చిట్టా తమ దగ్గర ఉందన్నారు.

మొత్తానికి గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల విదేశీ పర్యటనలతో పాటు తాజాగా ప్రతిపక్ష నేత జగన్ లండన్ టూర్ ఏపీలో దుమారాన్ని లేపుతున్నాయి. విదేశీ టూర్లపై వచ్చిన ఆరోపణలకు టీడీపీ, వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Similar News