కర్నాటకలో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్, మంత్రి పుత్తరాజు ఇళ్లతోపాటు ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి... ' జేడీఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో మమ్మల్ని బెదిరించడానికి ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఐటీ దాడుల ద్వారా ఆయన నిజమైన సర్జికల్ స్ట్రైక్స్కు తెరతీశారు. ఆయనకు.. రాజ్యాంగం ప్రసాదించిన పదవిని అనుభవిస్తున్న ఐటీ ఆఫీసర్ బాలకృష్ణ సహకరిస్తున్నారు* అని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు.