పీఎస్ఎల్వీ - సీ45 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. డీఆర్డీవోకు చెందిన ఇమిశాట్తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త రాకెట్ శత్రుదేశాల రాడార్ల బండారం బట్టబయలు చేస్తోంది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు.
నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు సాయంతో చేస్తున్న ప్రయోగం కాబట్టి దీనికి పీఎస్ఎల్వీ –క్యూఎల్ అని నామకరణం చేశారు. పీఎస్ఎల్వీ ద్వారా మూడు వేర్వేరు కక్ష్యల్లో భారత్తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఒకే ప్రయోగం ద్వారా మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి.
పీఎస్ఎల్వీ సీ - 45 రాకెట్ 436 కిలోల బరువు ఉంది. దీనిలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ పరికరాన్ని అమర్చారు. 749 కిలోమీటర్ల పైన సన్సింక్రోనస్ ఆర్బిట్లోకి చేర్చిన ఈ శాటిలైట్ 8ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 432కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇస్రో పర్యవేక్షణలో శ్రీహరికోటలో జరిగిన ప్రయోగానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్ నిఘా విభాగంలోకి ఇది సరికొత్త అస్త్రం ఈ 'ఇమిశాట్'. దీనిని ముద్దుగా 'రాడార్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. అత్యంత పదునైన ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ దీనికి ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది.
సీ 45 రాడార్ నెట్వర్క్పై ఓ కన్నేసి పెడుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడా రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం , చిత్రాలను అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు , బెలూన్లను ఉపయోగించేవారు. యుద్ధ సమయంలో ఏ దేశమైన తొలుత శత్రుదేశాల కమ్యూనికేషన్ స్థావరాలను, వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఇందుకోసం ముందుగా శత్రువుల కమ్యూనికేషన్ స్థావరాలు, రాడార్ వ్యవస్థలను గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పనిని ఇమిశాట్ చేస్తుంది.