అమరావతిలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపు కౌంటింగ్ అనంతరం భారీగా నేతలు చేరుకునే అవకాశం ఉన్నందున ఏపీఎస్పీతోపాటు గుంటూరు అర్బన్ పోలీసులను భద్రతకోసం ఏర్పాటు చేశారు. నేతల ఇళ్ల వద్ద భద్రతపై సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణం ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీ)కి చెందిన రెండేసి కంపెనీలు పహరా కాస్తాయి. స్థానిక పోలీసులు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అభ్యర్థులు గెలుపొందిన వెంటనే నేరుగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తరలివస్తే వారందరిని నియంత్రించటం స్ధానిక పోలీసులకు కష్టమవుతుందని ఏపీఎస్పీ పోలీసులను భద్రత విధులకు తీసుకున్నారు.