ఎన్డీఏ-2 సర్కార్ లో మొత్తం 57 మందికి కేంద్ర మంత్రిరవర్గంలో అవకాశం దక్కింది. వీరిలో 36 మంది గత కేబినెట్ లో ఉన్నవారు కాగా.. 21 మంది కొత్తవారు. ఈసారి మంత్రివర్గ కూర్పుపై మోడీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని పక్కన పెట్టి, విధేయతకే పట్టం కట్టారు. రాష్ట్రాలవారీగా కేంద్ర కేబనెట్ లో పార్టీలకు ప్రాధాన్యత కల్పించారు.
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాలవారీగా గెలిచిన స్థానాలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రాలకు, పార్టీలకు ప్రాధాన్యత కల్పించారు. 58 మందితో కేంద్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరగా వీరిలో ఉత్తర్ప్రదేశ్ నుంచి అత్యధికంగా 9 మంది ఉన్నారు. ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఉత్తర్ప్రదేశ్ తర్వాత ఆ రాష్ట్రానికే అధిక ప్రాధాన్యత కల్పించారు. పశ్చిమబెంగాల్, ఒడిశాలకు ప్రాధాన్యం పెంచుతారని ముందు నుంచి ఆశించినా ఎన్డీఏ-1 తరహలోనే ఇరు రాష్ట్రాలకు రెండు పదవులనే కేటాయించారు.
గుజరాత్, రాజస్థాన్లలో బీజేపీ 100శాతం సీట్లు గెలుచుకున్నప్పటికీ.. కేంద్ర కేబినెట్లో ఒక్కో రాష్ట్రానికి మూడు బెర్తులే దక్కాయి. తెలంగాణ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సోం, గోవా, జార్ఖండ్, అరుణాచల్ప్రదేశ్, ఛత్తీస్గడ్ల నుంచి ఒకొక్కరికే అవకాశం ఇచ్చారు. ఏపీతో పాటు మరో ఆరు రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం దక్కలేదు.
ఎన్డీయే మిత్రపక్షాల్లో శివసేన, శిరోమణి అకాళీదళ్, ఎల్జేపీ, ఆర్పీఐకు మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. జేడీయూ, అన్నాడీఎంకే, అప్నాదళ్, ఆర్ఎల్పీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, సిక్కిం క్రాంతికారి మోర్చా, మిజోనేషనల్ ఫ్రంట్, నాగాపీపుల్స్పార్టీ, నేషనల్ పీపుల్స్పార్టీ, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్పార్టీలకు చోటు లభించలేదు. జేడీయూ నుంచి 16 మంది గెలిచిన్పటికీ ఒక్కరూ చేరలేదు. ఆర్పీఐ లోక్సభలో ఒక్కసీటు గెలవకపోయినా ఆపార్టీనేత రామ్దాస్ అథవాలేకి స్థానం కల్పించారు.
కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూ నిరాకరించింది. ఆ పార్టీ నుంచి ఒకరికే అవకాశం ఇస్తామని చెప్పడంతో కేబినెట్ లో చేరేందుకు నీతీశ్కుమార్ ససేమిరా అన్నారు. ఎన్డీఏలో తమకన్నా తక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీలను, తమను ఒకేలా చూటం సరికాదని నీతీశ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పుడు కేంద్రంలో ఒక మంత్రి పదవికి అంగీకరిస్తే, బీజేపీకి లొంగిపోయినట్లు సంకేతాలు వెళ్తాయని నీతీశ్ భావించినట్లు జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి కేబినెట్పై మోడీ ముద్ర స్పష్టంగా కనిపించింది. వాజ్పేయి హయంలో పనిచేసిన రాజ్నాథ్సింగ్, రవిశంకర్ ప్రసాద్ కు మాత్రమే కొత్త కేబినెట్ లో బెర్తులు దక్కాయి. మోడీ విధేయతే ఏకైక సూత్రంగా కేబినెట్ను నిర్మించారు. పలు రాష్ట్రాల్లో కొత్త తరం నేతలను తయారు చేసేందుకు మొదటిసారిగా పలువురికి ఈ కేబినెట్లో అవకాశం ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారినెవవరినీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గత ప్రభుత్వంలో తనకు తలనొప్పులు తెచ్చి పెట్టిన వివాదాస్పదులను పక్కనబెట్టారు. మొత్తం మీద విధేయతకే మోడీ పట్టం కట్టారు.