వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సమాజ్వాది నేత అజంఖాన్ మరో సారి హద్దు మీరారు. తనపై పోటీకి దిగిన జయప్రదపై సభ్యత మరచి వ్యాఖ్యలు చేశారు. మహిళా అని చూడకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో వెనక్కు తగ్గారు.
ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు దారి తప్పుతున్నాయి. నైతిక ప్రవర్తన మరిచి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో వెగటు పుట్టిస్తున్నాయి. రాంపూర్ లోక్ సభ నుంచి సమాజ్వాద్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అజంఖాన్ తన ప్రత్యర్ధి బీజేపీ నుంచి బరిలోకి దిగిన జయప్రదపై మరో సారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన జయప్రద ఖాకీ లోదుస్తులు ధరించారంటూ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు.
అజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జయప్రద అందే స్ధాయిలో మండిపడ్డారు. అజంఖాన్ లాంటి వ్యక్తులతో ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలోని మహిళలు గురించి కూడా ఇలాగే మాట్లాడతారా ? అంటూ అజంఖాన్ను ప్రశ్నించారు.
సభ్యత మరచి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అజంఖాన్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు రావడంతో సమాజ్వాది నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తాను జయప్రద గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ అజంఖాన్ వివరణ ఇచ్చారు. తాను అన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ ప్రకటించారు.
అజంఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళ కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తాజా పరిణామాలతో ఉత్తర ప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. అజంఖాన్ వ్యాఖ్యల టార్గెట్గా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేయగా ఎస్పీ,బీఎస్పీలు ఎదురుదాడితో నష్టనివారణ చర్యలు చేపట్టాయి.