తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. లక్ష రూపాయల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రైతుల రుణమాఫీ అంశంలో ఇప్పటి వరకు ఏ తేదీని కటాఫ్గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణమాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. తాజాగా రైతు రుణాలు మాఫీపై బడ్జెట్లో సీఎం రైతులకు స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా రుణమాఫీ చేయనున్నారు.