వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని ఈసీ తేల్చిచెప్పింది. ముందు ఈవీఎమ్స్ లెక్కించిన తర్వాతే ఐదు వీవీప్యాట్ల స్లిప్పులను కౌంటింగ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓట్ల లెక్కింపులో ముందుగా వీవీప్యాట్లను లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను కౌంటింగ్ చేయాలంటూ ఎన్డీయేతర పార్టీలు ఈసీని కోరాయి. విపక్షాల డిమాండ్పై ఇవాళ చర్చించిన కేంద్ర ఎన్నికల సంఘం లెక్కింపు ప్రక్రియను ఇప్పుడు మార్చడం కుదరదని తేల్చిచెప్పింది.
ఇప్పటికిప్పుడు కౌంటింగ్ ప్రక్రియను మార్చడం కుదరదన్న ఎన్నికల సంఘం ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టంచేసింది. మొదట వీవీప్యాట్లను లెక్కించిన తర్వాతే ఈవీఎమ్స్ను కౌంటింగ్ చేయాలన్న విపక్షాల డిమాండ్ను ఈసీ తిరస్కరించింది. ఎప్పటిలాగే ముందుగా ఈవీఎమ్స్ను కౌంటింగ్ చేస్తారని ఎన్నికల సంఘం ప్రకటించింది.