షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ప్రచారాన్ని కుదిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుతో పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ముగింపు దశలో ఉండటంతో బీజేపీ, టీఎంసీలు నువ్వానేనా అన్నంత రీతిలో మాటల దాడికి దిగాయి. మోడీ, మమతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు సంధించారు.
చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ టీఎంసీని మరోసారి టార్గెట్ చేశారు. మే 14న కోల్కత్తాలో సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై టీఎంసీ కార్యకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని స్థానంలో మరో పెద్ద విగ్రహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కూడా టీఎంసీ కార్యకర్తల గూండాయిజం వల్ల తాను ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో నిలిపివేసి, వేదిక దిగాల్సిన పరిస్థితి వచ్చిందని ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ ఆరోపించారు.
షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ప్రచారాన్ని కుదిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుతో పశ్చిమ బెంగాల్లో మోడీ రెండు సభల్లో పాల్గొన్నారు. మమత బెనర్జీని, మమత అల్లుడిని టార్గెట్ చేశారు. మే 23 తర్వాత బెంగాల్లో వీరి ఆటలు సాగవని మోడీ అన్నారు. జై శ్రీరాం అని అనడం కూడా పశ్చిమ బెంగాల్లో ఓ నేరంగా పరిగణిస్తున్నారని మే 23 తర్వాత అలా జరగదని మోడీ అన్నారు.
పశ్చిమబెంగాల్లో అల్లర్లపై ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షాను మమతా బెనర్జీ తప్పుపట్టారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల ప్రచారాన్ని ఈసీ కుదించిందంటూ మండిపడ్డారు. మధురాపూర్లో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ప్రధాని ఒక సైతాన్ అని, అమిత్షా గూండా అని విమర్శించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా మే 14న కోల్కతాలో జరిగిన అల్లర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తీసుకున్నారు. ఆ ఘర్షణలకు నిరసనగా మమత బేలియాఘాటా నుంచి శ్యామ్ బజార్ వరకు ఆరు కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో వేల సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు, మద్దతు దారులు జెండాలు పట్టుకొని ఆమె వెంట నడిచారు.